ఏపీలో తొలిసారిగా సోలార్ పవర్తో వినియోగించే మరుగుదొడ్లను రూ.40 లక్షల వ్యయంతో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం స్టీమర్ రోడ్డులో ఒఎన్జ...
ఏపీలో తొలిసారిగా సోలార్ పవర్తో వినియోగించే మరుగుదొడ్లను రూ.40 లక్షల వ్యయంతో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం స్టీమర్ రోడ్డులో ఒఎన్జిసి నిర్మించింది. వీటిని బుధవారం ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఒఎన్జిసి రాజమహేంద్రవరం అసెట్ పరిధిలో ఈ ఏడాది రూ.2.55 కోట్ల వ్యయంతో 13 సోలార్ మరుగుదొడ్లు నిర్మించాలని సంస్థ నిర్ణయించింది. విద్యుత్ దీపాలు, ఓవర్ హెడ్ ట్యాంకులో నీరు నింపడం, ఇతర పనులకు సోలార్ విద్యుత్ను వినియోగించనున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఐదు మరుగుదొడ్లను ఎమ్మెల్యే బి.మాధవనాయుడు, ఒఎన్జిసి అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ బుధవారం ప్రారంభించనున్నారు. స్వచ్ఛభారత్లో భాగంగా మరుగుదొడ్లను ఒఎన్జిసి నిర్మించింది. మరుగుదొడ్లకు సంబంధించిన సోలార్ విద్యుత్ యూనిట్లను డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఒ) సర్టిఫై చేసిందని ఒఎన్జిసి అధికారులు తెలిపారు. మామూలు మరుగుదొడ్లతో పోలిస్తే సోలార్ మరుగుదొడ్లు 50 శాతం నీటిని ఆదా చేస్తాయని ఒఎన్జిసి అధికారులు చెబుతున్నారు.
ఒఎన్జిసి భాగస్వామ్యంతో రూ.కోటి వ్యయంతో పది రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు నిర్మించింది. రాజమహేంద్రవరం అసెట్ పరిధిలో సిఎస్ఆర్ నిధులను నూరు శాతం ఖర్చు చేస్తున్నామని ఒఎన్జిసి అసెట్ మేనేజర్ డిఏంఆర్ శేఖర్ తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం, సోలార్ మరుగుదొడ్ల నిర్మాణం, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, రక్షిత తాగునీరు, పాఠశాలల్లో డిజిటల్ క్లాస్రూమ్ల ఏర్పాటుకు సిఎస్ఆర్ నిధులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలకు సిఎస్ఆర్ నిధులను వినియోగిస్తున్నారు. సిఎస్ఆర్ నిధులు పూర్తిగా వినియోగించడం వల్ల ఏటా రెట్టింపు నిధులు మంజూరవుతున్నాయి.