దేశంలో కరోనా కేసులు మరోమారు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రయాణీకుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. నిన్న దిల్ల...
దేశంలో కరోనా కేసులు మరోమారు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రయాణీకుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. నిన్న దిల్లీ ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. తాజాగా పశ్చిమబెంగాల్ కూడా ఈ జాబితాలో చేరింది. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, కర్ణాటక నుంచి బెంగాల్కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. కరోనా కేసులు పెరుగుతున్న ఈ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని, నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుందని ఆదేశాలు జారీచేసింది. ఈ నిబంధనలు శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దిల్లీ సర్కార్ కూడా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించాలని వెల్లడించింది. ఈ నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. మార్చి 15 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొన్నది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఈ ఐదు రాష్ట్రాలనుంచి వచ్చే ప్రయాణికులు నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుందని గత మంగళవారం ఆదేశాలు జారీచేసింది.అలాగే కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. అక్కడి నుంచి వచ్చేవారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని ప్రకటించింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా మహారాష్ట్రతో సరిహద్దును పంచుకునే జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి.