అహ్మదాబాద్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న చివరి రెండు టెస్టులతోపాటు టీ20 సిరీస్కు వేదిక కానున్న మొతేరా స్టేడియం (సర్దార్ పటేల్ స్టేడియం) ...
అహ్మదాబాద్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న చివరి రెండు టెస్టులతోపాటు టీ20 సిరీస్కు వేదిక కానున్న మొతేరా స్టేడియం (సర్దార్ పటేల్ స్టేడియం) ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన ఇది భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న మూడో టెస్టుకు తొలిసారి వేదిక కాబోతోంది. గుజరాత్లోని సబర్మతి నది ఒడ్డున 1982లో దీనిని నిర్మించారు. అక్టోబరు 2015లో దీనిని పునరుద్ధరించాలని, సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ స్టేడియానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్న బీసీసీఐ, ఇరు జట్ల క్రికెటర్లు స్టేడియంపై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పునరుద్ధరణకు ముందు ఈ స్టేడియం సామర్థ్యం 49 వేలు మాత్రమే. ఇప్పుడు దీని సామర్థ్యం రెండింతలకు పెరిగింది. చారిత్రక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ స్టేడియం సామర్థ్యం 90 వేలే కాగా, ఇప్పుడు దీనిని మొతేరా స్టేడియం అధిగమించింది.
మొతేరా స్టేడియానికి సంబంధించి మరిన్ని విశేషాలు
* పేరు: సర్దార్ పటేల్ స్టేడియం/మొతేరా స్టేడియం
* మైదానం పరిమాణం: 180 X 150 గజాలు
* వేదిక పరిమాణం: 63 ఎకరాలు, నాలుగు ప్రవేశ ద్వారాలు
* సౌకర్యాలు: నాలుగు టీం డ్రెస్సింగు రూములు, ఆరు ఇండోర్ ప్రాక్టీస్ పిచ్లు, మూడు అవుట్డోర్ ప్రాక్టీస్ ఫీల్డ్స్
* స్టేడియం సామర్థ్యం: ఒకేసారి 1,10,000 అభిమానులు కూర్చుని మ్యాచ్ను వీక్షించొచ్చు. ప్రపంచంలోని రెండో అతిపెద్ద స్టేడియం
చరిత్ర
పునరుద్ధరణ కోసం స్టేడియంను మూసివేయడానికి ముందు ఇక్కడ 12 టెస్టులు, 23 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ జరిగింది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 1984-85లో జరిగిన మ్యాచ్తో తొలి అంతర్జాతీయ మ్యాచ్కు వేదిక అయింది. 2006లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఈ వేదిక కూడా ఉంది. ఇక్కడ మొత్తం 5 మ్యాచ్లు జరిగాయి. ప్రపంచకప్ మ్యాచ్లు కూడా ఆతిథ్యమిచ్చింది.
టెస్టు చరిత్ర
ఇప్పటి వరకు ఇది 12 టెస్టులకు ఆతిథ్యమిచ్చింది. 2009లో ఇక్కడ శ్రీలంక ఒక ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 760 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు. 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 76 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది అత్యల్పం.