దిల్లీ: రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై దాడి ఘటనలో మణిందర్ సింగ్ అనే మరో కీలక నిందితుడిని దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ...
దిల్లీ: రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై దాడి ఘటనలో మణిందర్ సింగ్ అనే మరో కీలక నిందితుడిని దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఎర్రకోట వద్ద కత్తులను ప్రదర్శిస్తూ.. సంఘవిద్రోహ శక్తులను హింసకు ప్రేరేపించినట్లు అప్పటి వీడియోలు, ఫొటోల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడిని బుధవారం స్వరూప్నగర్లోని తన ఇంట్లోనే అరెస్టు చేసినట్లు డీసీపీ ప్రమోద్ కుశ్వాహా తెలిపారు.
'ప్రస్తుతం అరెస్టయిన మణిందర్ అనే వ్యక్తి స్థానికంగా ఏసీ మెకానిక్గా పనిచేస్తూనే... కత్తిసాము శిక్షణ స్కూల్ నడుపుతున్నాడు. రిపబ్లిక్డే రోజున తన అనుచరులతో కలిసి ప్రణాళిక ప్రకారం.. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో చేరాడు. అలా ఎర్రకోటకు చేరుకుని కత్తులను ప్రదర్శిస్తూ.. సంఘవిద్రోహ శక్తుల్ని పోలీసులపైకి ఉసిగొల్పడంలో కీలక పాత్ర పోషించాడు. అతడిని ఫొటోలు, వీడియోల ఆధారంగా గుర్తించాం. ఆ హింసాత్మక ఘటన వ్యవహారంలో అతడు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఎర్రకోట ఘటనకు ముందు కూడా నిందితుడు పలుమార్లు సింఘు బార్డర్కు వెళ్లి వచ్చినట్లు విచారణలో చెప్పాడు' అని డీసీపీ ప్రమోద్ కుష్వాహా తెలిపారు. అతడి వద్ద నుంచి 4 అడుగుల పొడవైన రెండు కత్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా నిందితుడి మొబైల్లోనూ ఎర్రకోట వద్ద కత్తులతో ప్రదర్శన చేస్తున్న దృశ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు కుష్వాహా వివరించారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో రైతులు రిపబ్లిక్ డే రోజున చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పలువురు వ్యక్తులు ఎర్రకోట వద్దకు చేరి విధ్వంసం సృష్టించారు. చారిత్రక ఎర్రకోటపై మతపరమైన జెండాతో పాటు, రైతుల జెండాలను ఎగురవేశారు.