న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సోనుసూద్ శుక్రవారం సుప్రీం కోర్టులో తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. సీజేఐ జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే న...
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు సోనుసూద్ శుక్రవారం సుప్రీం కోర్టులో తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. సీజేఐ జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సోనుసూద్ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ముంబైలోని జూహు ప్రాంతంలోని ఆయన నివాసంలో అక్రమ నిర్మాణాలపై బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని ఆయన జనవరి 31న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా పిటిషన్ను ఉపసంహరించుకోవాలని క్లయింట్కు సూచించాలని సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గికి ధర్మాసనం సూచించింది. ఈ మేరకు ఆయన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. జుహులోని ఆరు అంతస్తుల 'శక్తి సాగర్' భవనాన్ని హోటల్గా మార్చడంపై మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ (ఎంఆర్టీపీ యాక్ట్) కింద బీఎంసీ జనవరి 4న జుహు పోలీస్స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా నివాస భవనాన్ని హోటల్గా మార్చారనే ఆరోపణలతో సూద్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఎంసీ తన ఫిర్యాదులో కోరింది. దీంతో ఆయన స్థానిక కోర్టును ఆశ్రయించగా పిటిషన్ను తిరస్కరించింది. మళ్లీ గత నెలలో బాంబే హైకోర్టును ఆశ్రయించగా కొట్టివేసింది.