Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

తాత్కాలిక బడ్జెట్‌ ముఖ్యాంశాలు

గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వెల్లడిస్తూనే, వరుసగా వరాల జల్లును ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ కురిపించారు. 2019-20 సం...



గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వెల్లడిస్తూనే, వరుసగా వరాల జల్లును ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ కురిపించారు. 2019-20 సంవత్సరానికి గాను తాత్కాలిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతూ ఎన్‌డీఏ హయాంలో ఈ స్థాయిలో నజరానాలెప్పుడూ అందించలేదనే చెప్పాలి.  ఈ బడ్జెట్‌. ముఖ్యంగా రైతులకు బలమైన ఊరట, వేతన జీవికి పన్ను మినహాయింపులు భారీగా లభించాయి.  ఆ వివరాలన్నీ సంక్షిప్తంగా....
* ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ కింద 5 ఏకరాల లోపు రైతులకు ఏటా రూ.6,000 చెల్లిస్తారు. దీనిని రూ2,000 చొప్పున మూడు విడతలుగా అందిస్తారు. ఈ మొత్తం నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో పడుతుంది. మొత్తం 12 కోట్ల మంది చిన్న రైతులు దీని నుంచి లబ్ధి పొందుతారని అంచనా. దీనికోసం మొత్తం రూ.75,000 కోట్లను కేటాయించారు.
* ఆదాయ పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు. రూ.6.5లక్షల వరకు ఆదాయం ఉండి  ప్రావిడెంట్‌ఫండ్‌, ప్రతిపాదిత పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.2లక్షల వరకు గృహరుణాలు, ఆరోగ్య బీమా, జాతీయ పింఛను పథకానికి చెల్లించే వారికి మినహాయింపు లభించనుంది. దీంతో మూడు కోట్ల మంది ప్రజలకు రూ.18,500 కోట్ల మేరకు లబ్ధి పెరుగుతుంది.
* ఉద్యోగుకు చెల్లించే గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20లక్షలకు పెంపు
* రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు స్టాండర్డ్ డిడక్షన్‌ పెంపు .
* రెండో గృహానికి కూడా అద్దె చెల్లించే వారికి ఆ మేరకు ఆదాయ పన్ను మినహాయింపు.
* పోస్టాఫీస్‌ పొదుపు పథకాలపై వచ్చే వడ్డీపై టీడీఎస్‌ రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంపు.
* ఇంటి అద్దెలపై టీడీఎస్‌ రూ.1.80 లక్షల నుంచి  రూ.2లక్షలకు పెంపు.
* ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 54 కింద రెండు ఇళ్లపై పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి సంబంధించి రూ.2 కోట్ల వరకు మూలధన లబ్ధి (కేపిటల్స్‌ గెయిన్స్‌) నుంచి మినహాయింపు. జీవిత కాలంలో ఇది ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. అలాగే పేదలకు ఇళ్ల పథకం కింద 2020లోపు రిజిస్టర్‌ చేసుకొన్న గృహ ప్రాజెక్టులకు ఆదాయపన్ను మినహాయింపు.
* పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులకు మధ్య ఎటువంటి సంబంధం లేకుండా చేస్తామని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. పన్ను వ్యవస్థను పూర్తిగా కంప్యూటరీకరిస్తాం అని వెల్లడించారు. 
* ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధిని రూ.62,574 కోట్ల నుంచి రూ.76,800 కోట్లకు పెంచారు. కేటాయింపుల్లో 35శాతానికి పైగా పెంపు.
* రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌కు రూ.750  కోట్ల కేటాయింపు. దీంతో పాటు పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమకు చెందిన రైతులు తీసుకొన్న కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాలపై 2శాతం వడ్డీ రాయితీ.
* ప్రకృత్తి విపత్తులకు గురైన ప్రాంతాల్లోని రైతులు తీసుకొన్న రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ, దీంతోపాటు సకాలంలో చెల్లింపులు చేసిన వారికి 3శాతం వడ్డీ రాయితీ.
* ప్రధాన మంత్రి శ్రమ్‌ యోజన కింద నెలకు రూ.3,000 పింఛను చెల్లిస్తారు. దీనికోసం సంఘటిత రంగ కార్మికులు నెలకు రూ.100 చెల్లించాలి. ఈ పథకం కింద ఐదేళ్లలో 10కోట్ల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది.
* రక్షణ బలగాలకు రూ.3,00,000 కోట్లకు పైగా కేటాయింపులు. అవసరమైతే అదనపు నిధుల కేటాయింపు.
* సైనిక దళాల వేతనాల పెంపు. వన్‌ ర్యాంక్‌ వన్‌ పింఛన్‌కు రూ.35,000 కోట్ల కేటాయింపు
* నీతి ఆయోగ్‌ గుర్తించిన తొమ్మిది విభాగాల్లో కృత్రిమ మేధకు సంబంధించిన పోర్టళ్ల అభివృద్ధి.
* మారుమూల ప్రాంతాల్లో పక్కా రోడ్ల నిర్మాణాకి రూ.19,000  కోట్లు.
* హైడ్రోకార్బన్ల దిగుమతులు తగ్గించుకోవడానికి చర్యలు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన సిఫార్సుల అమలుకు ప్రయత్నాలు.
* ఈశాన్య భారత దేశానికి కేటాయింపులు రూ.58,166 కోట్లకు పెంపు. గత ఏడాదితో  పోలిస్తే ఇది 21శాతం అదనం.
* భారతీయ సినీ నిర్మాణ సంస్థలకు సింగిల్‌ విండో క్లియరెన్స్‌. ఇది ఇప్పటి వరకు విదేశీ సంస్థలకు మాత్రమే ఉంది. సినీ పైరసీ అరికట్టడానికి సినిమాటోగ్రఫీ చట్టం.
* రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్‌ ఉన్న వారు మూడు నెలలకోసారి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయవచ్చు.
* వచ్చే ఐదేళ్లలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. వచ్చే ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారుతుంది.