జమ్మూపై పాక్ హమాస్ తరహా దాడి భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ దాడి...
జమ్మూపై పాక్ హమాస్ తరహా దాడి
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. భారత్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని సమర్థంగా, సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. పఠాన్కోట్, జమ్ము నగరం, ఉధంపూర్లో మూడు పాక్ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. జమ్మూ లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్ను ప్రయోగించగా, పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణులు, డ్రోన్లను భారత వాయు సేన నేలమట్టం చేసింది.
జమ్ము యూనివర్సిటీ వద్ద రెండు డ్రోన్లను కూల్చివేశాయి. అలాగే సట్వారీలోని జమ్ము విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ పాకిస్థాన్ ఎనిమిది క్షిపణి దాడులు చేసింది. వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. హమాస్ ఉగ్ర సంస్థ తరహాలో ‘చవకబారు’ రాకెట్లను ప్రయోగిస్తోందని, సట్వారీ (జమ్ము విమానాశ్రయం), సాంబ, ఆర్ఎస్ పుర, అర్నియా తదితర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని, వాటన్నిటినీ మధ్యలోనే అడ్డుకుని కూల్చేశామని వివరించాయి.
పాక్ సైన్యం వెనుతిరిగినట్లుగా ఉంటూనే అదును చూసుకుని మెరుపుదాడులకు దిగుతూ రావడంతో భారతీయ సైన్యం అన్ని శ్రేణులలో అన్ని స్థాయిల్లో అప్రమత్తం గా ఉంది. తమకు అనువైన జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల ఆవల నుంచి పాకిస్థా న్ సైన్యం విరుచుకుపడుతోందని వెల్లడైంది. జమ్మూ , పంజాబ్ లోపలి ప్రాంతాలు ప్రత్యేకించి అమృత్సర్, రాజస్థాన్ల్లోని ప్రాంతాల ను ఎంచుకుని పాక్ డ్రోన్లు దూసుకురావడం తో పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ పరిస్థితి ఏర్పడింది.
పలు సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేకించి జలంధర్, అమృత్సర్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు, హర్యానాలో, అన్నింటికి మించి జమ్మూ కశ్మీర్లోని లోతట్టు ప్రాంతాలలో ఇప్పుడు అప్రకటిత యుద్ధ వాతావర ణం నెలకొంది. హమాస్ తరహాలోనే పాకిస్థాన్ ఆర్మీ కూడా వ్యవహరిస్తోందని మండిపడింది. నెల కిందట పాక్ ఆక్రమిత కశ్మీరులో ఐఎ్సఎస్, హమాస్ ఉగ్రవాదుల మధ్య సమావేశం జరిగిన విషయాన్ని ఉటంకించింది.
పాక్ డ్రోన్లు, రాకెట్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం చేస్తుండడంతో అక్కడ భారీ పేలుళ్లు జరుగుతున్నాయా అన్నట్లు పెద్ద ఎత్తున శబ్ధాలు వస్తున్నాయి. అలాగే, కుప్వారా, బారాముల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ భారీ ఎత్తున గుళ్ల వర్షం కురిపిస్తోంది. అయినా, అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి.
తొలుత, ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులతో రగిలిపోతున్న దాయాది దేశం భారత్లోని 15 ప్రధాన నగరాల్లోని ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించింది. జమ్ముకశ్మీర్ నుంచి గుజరాత్ దాకా.. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లోని 15 నగరాలపై బుధవారం అర్ధరాత్రి దాటాక చైనాకు చెందిన మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. కానీ.. పాక్ ప్రతీకార దాడులను ముందే ఊహించి అప్రమత్తంగా ఉన్న భారతసైన్యం ఆ దాడులను దీటుగా తిప్పికొట్టింది.
ఎస్-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్స్ను ఉపయోగించి.. భారత్వైపు దూసుకొస్తున్న క్షిపణులను గాల్లోనే పేల్చేసింది. పాక్ క్షిపణులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో వాటిని నిర్వీర్యం చేసినట్టు భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ జైషే మహ్మద్, లష్కరే తొయ్యిబా ఉగ్రసంస్థలు భారత భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. పాక్ దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పంజాబ్లోని గుర్దాస్పుర్ జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
“గుర్దాస్పుర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. అయితే ఆసుపత్రులు, సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు ఉంది. అయితే నిర్దేశించిన సమయంలో జైలు, ఆసుపత్రుల కిటికీలు కచ్చితంగా మూసి ఉంచాలి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి” అని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. దాడుల వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ Vandebharath.