దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున కరెన్సీ కట్టలు బయటపడి, దేశవ్యాప్తంగా సంచలనం రేపి...
దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున కరెన్సీ కట్టలు బయటపడి, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో ఆయన ఇంట్లో ఉన్నవి నిజమైన డబ్బులే అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన విచారణలో తేలింది. దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మను రాజీనామా చేయాలంటూ సూచించగా ఆయన మాత్రం తన తప్పేమీ లేదని, కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు.
ఈక్రమంలోనే సీజేఐ సంజీవ్ ఖన్నా జస్టిస్ యశ్వంత్ వర్మను పదవిలోంచి రాజీనామా చేయించాలని, లేని పక్షంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం చేపట్టాలని చెబుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు లేఖ రాశారు. వీటితో పాటే విచారణ నివేదికను కూడా పంపారు. మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
అయితే ఈ సమయంలో న్యాయమూర్తి అక్కడ లేరు. కాకపోతే కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలు ఆర్పారు. అప్పుడే వారికి వీరి ఇంట్లోని ఓ గదిలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో వాటిని వీడియోలుగా తీశారు. ఇలా ఈ విషయం వెలుగులోకి రాగా దేశ వ్యాప్తంగా సంచలనం రేగింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఉండడంపై అంతా ఆయన అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇలా ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది.
ముఖ్యంగా హైకోర్టు న్యాయమూర్తులపై చర్యలకు సంబంధించి 1999లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని అనుసరించి సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఓ కమిటీ విచారణ జరిపి నివేదిక ఇస్తుంది. అయితే దీన్నే అత్యున్నత న్యాయస్థానం ఫాలో అయింది. ముఖ్యంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులు ఈ కేసుపై అంతర్గత విచారణ జరిపారు.
ఈక్రమంలోనే జస్టిస్ యశ్వంత్ వర్మపై వస్తున్న ఆరోపణలు నిజమేనని గుర్తించారు. అలాగే ఆయన ఇంట్లో కూడా పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరికినట్లు తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ నివేదికను కూడా సిద్ధం చేశారు. తప్పు చేశారు కాబట్టి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేయాలని సీజేఐ సంజీవ్ ఖన్నా సూచించారు. కానీ ఆయన మాత్రం తనపై వచ్చినవన్నీ ఆరోపణలే అనీ, తానే తప్పు చేయలేదని చెప్పారు.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై జరిగిన అంతర్గత విచారణ నివేదికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు పంపించారు. అలాగే ఓ లేఖ రాస్తూ అందులో జస్టిస్ వర్మను రాజీనామా చేయించాలని సూచించారు. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే.. రాజ్యాంగం 217 ప్రకారం ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రారంభించడానికి రాష్ట్రపతికి సిఫార్సు చేశారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ Vandebharath.