రాష్ట్రాల్లోని బిజెపియేతర ప్రభుత్వాల పట్ల ఎన్డీయే ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తూ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందంటూ టీఆర్ఎస్ కార్యనిర్వ...
రాష్ట్రాల్లోని బిజెపియేతర ప్రభుత్వాల పట్ల ఎన్డీయే ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తూ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందంటూ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన విమర్శల్లో వాస్తవం లేదని ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలంటూ మండిపడ్డారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ఫలితాలు వస్తాయని గ్రహించి, ప్రజలను పక్కదారి పట్టించేందుకు మోదీ సర్కారుపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి పైసా ఇవ్వలేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సత్య దూరమని త్రోసిపుచ్చారు. వాస్తవానికి రూ.రెండు లక్షల కోట్ల నిధుల్ని రాష్ట్రానికి అనేక గ్రాంట్ల రూపంలో కేంద్రం ప్రకటించిందని దత్తాత్రేయ ప్రకటించారు.
తెలంగాణలో నిరంతర విద్యుత్తు ఘనత కేంద్రం పుణ్యమేనని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి 2,400 కి.మీ. ఉండగా ప్రాంతీయ వలయ రహదారి సహా కొత్త జాతీయ రహదారులు మంజూరు చేసి ఆ నిడివిని 5,600 కి.మీ.లకు పెంచింది ఎన్డీయే ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో రైలు, రాష్ట్రానికి 2.10 లక్షల ఇళ్ల మంజూరు.. ఇవన్నీ మోదీ సర్కారు చేసినవి కావా? అని కేటీఆర్ను ఆయన ప్రశ్నించారు.
ఈ సంవత్సరం ప్రధాన మంత్రి సడక్ యోజన కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.1,700 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా వెనక్కి పోయే ప్రమాదం ఉందని దత్తాత్రేయ తెలిపారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను పుస్తక రూపంలో ప్రచురించి ప్రజల్లోకి తీసుకువెళ్తామని దత్తాత్రేయ చెప్పారు.