ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నిర్మాణంలో కీలక ఘట్టం పూర్తయింది. స్పిల్వేలో...
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నిర్మాణంలో కీలక ఘట్టం పూర్తయింది. స్పిల్వేలో కీలకమైన గేట్లకు గడ్డర్ల బిగింపు పనులు ముగిసాయి. ప్రపంచంలోనే భారీ స్పిల్వే పోలవరం ప్రాజెక్టుదే. దీంతో స్పిల్వే నిర్మాణానికి అంతేస్థాయిలో భారీ గడ్డర్లను వినియోగించారు. నిర్మాణ పనులను చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ 60 రోజుల్లోనే 192 గడ్డర్లను అమర్చింది. స్పిల్వేపై గడ్డర్లు, షట్టరింగ్ పనులతోపాటు స్లాబ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసారు. స్పిల్వేలో 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తు వుండే ఒక్కో గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు దాకా ఉంటుంది. దీనిని బట్టి ఎంత పెద్ద గడ్డర్లో అర్థం చేసుకోవచ్చు. స్పిల్ వే కి ఇంత భారీ పరిమాణంలో గడ్డర్లను వినియోగించడం చాలా అరుదు. పోలవరం ప్రాజెక్టులో మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు.
మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2020 ఫిబ్రవరి 17న గడ్డర్ల తయారీని ప్రారంభించి, శనివారం నాటికి రికార్డుస్థాయిలో పూర్తి చేసింది. గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల భారీ క్రేన్లను రెండింటిని వినియోగించారు. నీటి పారుదల శాఖ అధికారులు, మేఘా కంపెనీ ఇంజనీర్లు పక్కా ప్రణాళికతో వరదలకు ముందే స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్ల అమర్చాలన్న లక్ష్యంను పెట్టుకొని సకాలంలో పూర్తి చేసారు. గోదావరికి భారీ వరదలు వచ్చినా పనులు ఆగకూడదని యుద్దప్రాతిపాదికన స్పిల్వేను పూర్తి చేసారు.