జగిత్యాల: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో కారు కాల్వలో పడిన ఘటన మరవక ముందే.. అలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మేడ...
జగిత్యాల: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో కారు కాల్వలో పడిన ఘటన మరవక ముందే.. అలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి వద్ద సోమవారం ఉదయం ఎస్సారెస్పీ కాల్వలోకి ఓ కారు దూసుకెళ్లింది. భార్య, కుమారుడు, కుమార్తె సహా అమరేందర్రావు అనే న్యాయవాది కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. కుమారుడు జయంత్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్రేన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కారుతోపాటు మృతదేహాలను వెలికితీశారు.
సొంతూరు జోగినపల్లిలో ఉత్సవాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుందామని న్యాయవాది కుటుంబం జగిత్యాల నుంచి కారులో బయలుదేరింది. మేడిపల్లి వరకూ రాగానే కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. అయితే కారు నడుపుతున్న కుమారుడు జయంత్ డోర్ తీసుకుని బయటపడ్డాడు. మిగతా ముగ్గురు మాత్రం కారులోనే చిక్కుకున్నారు. కాల్వలో నీటి ప్రవాహ వేగానికి కారు కొంత దూరం కొట్టుకుపోయింది. స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టేలోపే కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కుమార్తె శ్రేయకు ఇటీవల పెళ్లి నిశ్చయమైనట్లు సమాచారం.