Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌పై జో బిడెన్ ప్రశంసలు..ప్రత్యేకత ఏంటంటే -Vandebharath

  కరోనా వైరస్ అంతానికి మరో వ్యాక్సిన్ వచ్చి చేరింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు అమెరికా అత్యవసర అనుమతిచ్చింది....

 

కరోనా వైరస్ అంతానికి మరో వ్యాక్సిన్ వచ్చి చేరింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు అమెరికా అత్యవసర అనుమతిచ్చింది. మిగిలిన వ్యాక్సిన్‌లకు ఈ వ్యాక్సిన్‌కు చాలా తేడా ఉంది. ఆ వ్యత్యాసమేమంటే..

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్( Corona vaccination) కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్, భారత్ బయోటెక్ ( Bharat Biotech )కంపెనీ వ్యాక్సిన్‌లు వివిధ దేశాల్లో మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు మరో అంతర్జాతీయ కంపెనీ వచ్చి చేరింది. జాన్సన్ అండ్ జాన్సన్( Johnson & Johnson ) సంస్థకు చెందిన వ్యాక్సిన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిచ్చింది. అమెరికా అనుమతిచ్చిన మూడవ కరోనా వ్యాక్సిన్ ఇది. అయితే మిగిలిన వ్యాక్సిన్‌లకు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు చాలా వ్యత్యాసముంది. మిగిలినవాటిలా రెండు డోసులు ఇవ్వాల్సిన అవసరం లేదని..కేవలం ఒక్క డోసు ఇస్తే సరిపోతుందని జాన్సన్ అండ్ జాన్సన్ స్పష్టం చేసింది.

అమెరికా, లాటిన్‌ అమెరికా, దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రయోగాల్లో జేఅండ్‌జే వ్యాక్సిన్‌ ( J&J vaccine) అత్యంత సురక్షితమైనది, సామర్థ్యమైనదని తేలింది. కరోనా వైరస్‌పై 85% సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్‌ పని చేస్తుందని వివిధ ప్రయోగాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా వేరియెంట్ ( South african variant)పైన కూడా ఈ టీకా అద్భుతంగా పని చేస్తోందని ప్రాథమికంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది చివరి నాటికి కోటి డోసుల్ని ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. జాన్సన్‌ వ్యాక్సిన్‌ నిల్వ చేయడం కూడా చాలా సులభం. ఫైజర్, మోడెర్నా మాదిరిగా అత్యంత శీతల వాతావరణంలో ఉంచాల్సిన పని లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్లలో కూడా మూడు నెలల పాటు ఈ టీకా నిల్వ ఉంటుంది.

అమెరికాలో మూడవ కంపెనీకు అనుమతి రావడంపై అధ్యక్షుడు జో బిడెన్ ( Joe Biden) హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌లతో కరోనాపై పోరాటం ఇక తుది దశకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలందరికీ ఇది అత్యంత ఉత్సాహాన్నిచ్చే వార్తని బైడెన్‌ వ్యాఖ్యానించారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ను అన్ని విధాలుగా పరీక్షించి, రకరకాలుగా ప్రయోగాలు నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాతే ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చిందని జో బిడెన్ తెలిపారు. వీలైనంత త్వరగా దేశంలో అత్యధిక మందికి వ్యాక్సిన్‌ డోసులు ఇస్తేనే కరోనా ఉధృతిని కట్టడి చేయగలమని చెప్పారు.