టోక్యో : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గత ఏడాది టోక్యోలో విధించిన ఎమర్జెన్సీని జపాన్ ప్రభుత్వం ఎత్తివేసింది. టోక్యోలో ఒలింపిక్స్...
టోక్యో : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గత ఏడాది టోక్యోలో విధించిన ఎమర్జెన్సీని జపాన్ ప్రభుత్వం ఎత్తివేసింది. టోక్యోలో ఒలింపిక్స్ గత ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా వాయిదా వేశారు. ఈ క్రీడలను తిరిగి ఈ ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుపాలని ఒలింపిక్ క్రీడల నిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు టోక్యోలో ఏడాది క్రితం విధించిన ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమర్జెన్సీ ఎత్తివేయడంతో ఇప్పుడు టోక్యోలోకి వివిధ దేశాల క్రీడాకారులు వచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఇక్కడికి వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా రెండు వారాల క్వారంటైన్లో ఉండాలని జపాన్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే, వారు నిర్బంధంలో ఉండే ప్రాంతానికి సమీపంలోని స్టేడియంలోకి అనుమతిస్తారు.
కరోనా వైరస్ను అడ్డుకునేందుకు జపాన్ ప్రభుత్వం టోక్యోతోపాటు 11 నగరాల్లో ఎమర్జెన్సీ విధించింది. జపాన్లో ఇప్పటివరకు 4,31,000 మంది కరోనా వైరస్కు గురవగా.. దాదాపు 7,800 మంది చనిపోయారు. దాంతో ఈ వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. కేవలం భోజనం చేసే సమయంలో మాత్రమే మాస్కులు తీసేందుకు అధికారులు అనుమతిస్తారు. ఒలింపిక్స్ కోసం వివిధ దేశాల నుంచి దాదాపు 70 వేల మందికి పైగా క్రీడాకారులు, సిబ్బంది జపాన్ రానున్నారు. ఒలింపిక్ క్రీడలను వీక్షించేందుకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. అయితే ప్రేక్షకుల సంఖ్యను 20 వేలకు మించకుండా చూడనున్నట్లుగా సమాచారం. ఇలాఉండగా, ఒలింపిక్స్ కు హాజరయ్యే క్రీడాకారులు, సిబ్బందికి వాక్సిన్లు తీసుకోవడం తప్పనిసరి చేయడం వంటి నిర్ణయాన్ని ఇంతవరకు ఒలింపిక్ కమిటీ తీసుకోలేదు. అయితే, టోక్యోకు బయల్దేరే భారత క్రీడాకారులకు టీకాలు వేయనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.