మాస్కో: సాధారణంగా పక్షులకు వ్యాపించే ఏవియన్ ఫ్లూ (హెచ్5ఎన్8) లేదా బర్డ్ ఫ్లూ మానవులకూ సోకిందని రష్యా తెలిపింది. తొలి కేసును గుర్తించడం...
మాస్కో: సాధారణంగా పక్షులకు వ్యాపించే ఏవియన్ ఫ్లూ (హెచ్5ఎన్8) లేదా బర్డ్ ఫ్లూ మానవులకూ సోకిందని రష్యా తెలిపింది. తొలి కేసును గుర్తించడంతోపాటు ఆ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు అందజేసినట్లు శనివారం పేర్కొంది.
రష్యా హెల్త్ వాచ్ విభాగమైన రోస్పోట్రెబ్నాడ్జోరికి అధిపతి అయిన అన్నా పోపోవా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. దక్షిణ రష్యాలోని ఒక పౌల్ట్రీ ఫామ్లో పని చేసే ఏడుగురు కార్మికుల నుంచి సేకరించిన స్ట్రెయిన్ జన్యు పదార్థాన్ని వెక్టర్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు వేరు చేసి పరిశీలించగా ఈ విషయం నిర్ధారణ అయ్యిందని చెప్పారు.
ఆ ప్రాంతంలో గత ఏడాది డిసెంబర్లో బర్డ్ ఫ్లూ వెలుగుచూసిందని అన్నా తెలిపారు. అయితే ఏవియన్ ఫ్లూ సోకిన కార్మికుల్లో తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కనిపించలేదని వివరించారు. ఏవియన్ ఫ్లూ (హెచ్5ఎన్8) మానవులకు సోకినట్లు తొలిసారి గుర్తించామని, మొదటి కేసు గురించి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించామని అన్నారు. పక్షులకు మాత్రమే సోకే ఏవియన్ ఫ్లూ మనుషులకు వ్యాపించినట్లు ఇప్పటి వరకు ఎక్కడా రిపోర్ట్ కాలేదని చెప్పారు.
బర్డ్ ఫ్లూ వైరస్కు చెందిన ఒక స్ట్రెయిన్ మానవులకు సోకిందన్న సంగతి తొలిసారి తమ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందని అన్నా అన్నారు. ఇది చాలా ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణ అని ఆమె కొనియాడారు. ఈ వైరస్ మరింత పరివర్తన చెందుతుందా అన్నది వేచి చూడాలని వ్యాఖ్యానించారు.
ఏవియన్ ఫ్లూ ( హెచ్5ఎన్8 వైరస్) ఇప్పటి వరకు మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే సామర్థ్యాన్ని పొందలేదని అన్నా చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందని, ఈలోగా ప్రపంచం దీనిపై స్పందించి ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.