భారతదేశాన్ని అట్టుడికించిన బాబ్రీ కట్టడం కూల్చివేత కేసులో.. బలమైన ఆధారాలు ఏవీ లేవని.. ఈ విధ్వంసం ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదన...
భారతదేశాన్ని అట్టుడికించిన బాబ్రీ కట్టడం కూల్చివేత కేసులో.. బలమైన ఆధారాలు ఏవీ లేవని.. ఈ విధ్వంసం ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసులో లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ బుధవారం మధ్యాహ్నం తీర్పు వెల్లడించారు.
‘‘కూల్చివేతకు ముందస్తు ప్రణాళికలు వేయలేదు.. ఇది నిందితుల్లో ఎవరి ప్రమేయం లేకుండానే క్షణికావేశంలో జరిగింది’’ అని ఆయన పేర్కొన్నారు.
దర్యాప్తు అధికారులు ఫొటోల నెగటివ్లు ప్రవేశపెట్టలేదు. వీడియో క్యాసెట్లను టాంపరింగ్ చేశారు అని కోర్టులో లాయర్లు వాదించారు.
కట్టడంను ధ్వంసం చేయడానికి ముందుకొచ్చినవారికి ఆర్ఎస్ఎస్, వీహెచ్పీతో ఎలాంటి సంబంధాలు లేవని కోర్టు చెప్పిందని లఖ్నవూలో మీడియాతో మాట్లాడిన లాయర్లు చెప్పారు.
ఈ కేసులో బీజేపీ మార్గదర్శక మండలి చీఫ్ నేత లాల్కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి సహా మొత్తం 32 మంది నిందితులుగా ఉన్నారు.
అయితే.. అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, మహంత్ నృత్య గోపాల్ దాస్ సహా ఆరుగురు నిందితులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టకు హాజరయ్యారు.