వైరస్ వ్యాప్తిని తగ్గించడం కోసం విధించిన లాక్డౌన్ను దశలవారీగా కేంద్రప్రభుత్వం సడలిస్తూ వస్తోంది. దానిలో భాగంగా జూన్ 8 నుంచి మ...
వైరస్ వ్యాప్తిని తగ్గించడం కోసం విధించిన లాక్డౌన్ను దశలవారీగా కేంద్రప్రభుత్వం సడలిస్తూ వస్తోంది. దానిలో భాగంగా జూన్ 8 నుంచి మాల్స్ తిరిగి ప్రారంభంకానున్నాయి. ఇన్నాళ్లు అమ్ముడు కాకుండా ఉన్న వస్తువుల విక్రయాల కోసం డిస్కౌంట్ సేల్స్ ఉంటాయని సగటు వినియోగదారులు ఆశించడం సహజం. కానీ మాల్స్ మాత్రం అందుకు సుముఖంగా లేవు. అందుకు కారణం భౌతిక దూరం. డిస్కౌంట్లు అని చెప్పగానే అవసరంలేని వారు కూడా వచ్చేస్తారని, దాంతో ప్రభుత్వ నిబంధనలను పాటించడం కుదరదని సంబంధిత యాజమాన్యాలు భావిస్తున్నాయి.
దిల్లీ, ముంబయి, గురుగ్రామ్ తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో మాల్స్ జూన్ 8 నుంచి తిరిగి ప్రారంభం కావడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో మాల్స్ నిర్వాహకులు రానున్ను రోజుల్లో పరిస్థితులపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ‘నిజంగా అవసరం ఉన్నవారే మాల్స్కు రావాలనుకుంటున్నాం. డిస్కౌంట్లు పెడితే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది’ అని ఓ మాల్ యజమాని తెలిపారు. ‘భౌతిక దూరం, ఇతర భద్రతా చర్యలు పాటించడం సవాలుతో కూడుకున్నది. కానీ మేం అన్ని చర్యలు తీసుకుంటాం. ఒకసారి అమ్మకాలు మొదలైతే స్టోర్స్ బయట జనాలు క్యూ కట్టొచ్చు’ అని ప్యూమా ఇండియా కంట్రీ హెడ్ వెల్లడించారు. ‘ఇప్పుడు ఆశకు పోవడం సరికాదు.
డిస్కౌంటు కంటే సురక్షితమైన షాపింగ్ అనుభవాన్నే వినియోగదారులకు కల్పించాలి’ అని ఫ్యూచర్ రిటైల్ ఎండీ రాకేశ్ బియానీ అన్నారు. మరోవైపు కొన్ని మాల్స్ ప్యాండమిక్ రెస్పాన్స్ టీమ్, ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. షాపునకు వచ్చేప్పుడు భార్యభర్తలు కూడా భౌతిక దూరం నిబంధనను పాటించాలని సూచిస్తున్నాయి.