Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

దేశంలోని మహిళా శక్తికి జరిగిన అవమానం

కాంగ్రెస్ నేతలు ఈ దేశ మహిళలను అవమానిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆగ్రాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రక్షణమ...

కాంగ్రెస్ నేతలు ఈ దేశ మహిళలను అవమానిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆగ్రాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్ గాంధీ `ఒక మహిళ' అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాఫెల్ ఒప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఒక్కొక్క వాస్తవాన్ని వెల్లడిస్తూ ప్రతిపక్షం నోరు మూయించినా.. కాంగ్రెస్ నేతలు ఆ మహిళా రక్షణ మంత్రిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
ఇది కేవలం ఒక మహిళకు జరిగిన అవమానం కాదు.. దేశంలోని మహిళా శక్తికి జరిగిన అవమానం. ఇందుకు ఆ బాధ్యతారహితులైన నేతలు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రధాని హెచ్చరించారు. ఈ దేశంలో ఓ మహిళ తొలిసారి రక్షణ మంత్రి కావడం దేశానికే గర్వకారణం అని తెలిపారు. 
వేల కోట్ల రూపాయల యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో రాఫెల్ సంస్థకు వ్యతిరేకంగా క్రిస్టియన్ మిషెల్ పనిచేశారని ఆరోపించారు. తనను తాను మరోసారి చౌకీదార్ (కాపలాదారు)గా చెప్పుకున్న మోదీ, అవినీతిని కూకటివేళ్లతో పెకిలించివేసే సఫాయి పనిని చేపట్టానని చెప్పారు. మోదీ ప్రత్యేకమైన మట్టితో తయారైనవాడు. ఆయనను ఎవరూ భయపెట్టలేరు లేదా ప్రలోభపెట్టలేరు. ప్రతి పైసాకు లెక్క తీస్తాను. ఈ చౌకీదార్ నిద్రపోడు. తప్పుచేసే వారిని చీకటిలో కూడా పట్టుకోగలడని స్పష్టం చేశారు. 
"వారు నన్ను ఎంతగానైనా దూషించవచ్చు.. కానీ అవినీతిని పెకిలించివేసే పనిని మాత్రం ఆపివేయబోను" అని ప్రధాని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడినవారికి విద్యా ఉద్యోగాలలో 10శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని ప్రధాని మోదీ సమర్థించుకున్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్నవారికి ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు వల్ల అణగారినవర్గాలు, దళితులు, గిరిజనుల హక్కులకు ఎటువంటి నష్టం ఉండదని తెలిపారు. ఇక పౌరసత్వ బిల్లు వల్ల అసోం, ఈశాన్య రాష్ట్రాల  ప్రజల హక్కులు ఏమాత్రం తగ్గిపోవని చెప్పారు.