ముంబయి: బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర...
ముంబయి: బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా..ఈరోజు ఈ ప్రతిష్ఠాత్మక చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ‘ఝాన్సీ ప్రాంతంపై బ్రిటిషర్ల కన్నుపడింది. ఒకవేళ ఝాన్సీని కాపాడే అధికారి రాకపోతే ఈ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది’ అని ఓ మహిళ చెబుతున్న డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి..‘నేను ఇందాక ఓ అమ్మాయిని చూశాను. తన పేరు మణికర్ణిక’ అని చెప్తున్నప్పుడు కంగన పులిని వేటాడుతున్న సన్నివేశం ఆకట్టుకుంటోంది.
కత్తిసాము చేస్తున్న సమయంలో కంగన ముగ్గురు వ్యక్తులపై నుంచి దూకి ఏనుగుపై కూర్చున్న సన్నివేశం హైలైట్గా నిలిచింది. ఝాన్సీ ప్రాంతానికి మహారాణిగా మణికర్ణికను ప్రకటిస్తున్నప్పుడు..‘లక్ష్మీబాయి అనే నేను.. నా శరీరంలో రక్తం ప్రవహిస్తున్నంత వరకు ఝాన్సీని కాపాడతానని మాటిస్తున్నాను’ అని చెప్పడం బాగుంది. ఆ తర్వాత మణికర్ణిక తన భర్త, బిడ్డను కోల్పోవడం, ఝాన్సీ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం బ్రిటిషర్లను చీల్చిచెండాడం వంటివి ఆసక్తికరంగా చూపించారు.
కొన్ని కారణాల వల్ల సినిమాలోని పలు సన్నివేశాలకు కంగననే దర్శకత్వం వహించారు. ఇందులో లక్ష్మీబాయికి సన్నిహితురాలైన ఝల్కరీ బాయి పాత్రలో బుల్లితెర నటి అంకితా లోఖాండే నటించారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.