Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

తెలంగాణ కు రీజినల్ రింగ్ రోడ్ కేంద్రం ఆమోదం

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారగల రీజినల్ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు కేంద్ర ప్రభుత్వం  సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.నాలుగు ...



తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారగల రీజినల్ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు కేంద్ర ప్రభుత్వం  సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.నాలుగు వరుసల హైదరాబాద్‌ ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి అడ్డంకులు తోలగిపోయాయి.  హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో నగరం చుట్టూ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ప్రాంతీయ రహదారి నిర్మాణం నిమిత్తం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది.   


 రీజినల్ రింగురోడ్డును రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డుకు వెలుపల నాలుగు వరుసలు, 338 కి.మీ. నిడివితో నిర్మించనున్నారు. ఇది సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, శంకరపల్లి మీదుగా కంది వరకు నిర్మాణం కానుంది 

 సంగారెడ్డి నేషనల్ హైవే 161 నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు 152 కిలోమీటర్ల రహదారిని నిర్మించి నేషనల్‌హైవే 56కి కలుపుతారు. చౌటుప్పల్ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా ఆమన్‌గల్, షాద్‌నగర్, చేవెళ్ల, శంకర్‌పల్లి నుంచి కంది ద్వారా 186 కిలోమీటర్ల రహదారిని నిర్మించి సంగారెడ్డి ఎన్‌హెచ్-65కి అనుసంధానం చేస్తారు. 

నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్, నాచారం, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్, జనగామ, వల్లెపల్లి, షాద్‌నగర్‌లలో బైపాస్‌రోడ్లు నిర్మిస్తారు. ఫరూఖ్‌నగర్, దౌడుగూడ, గుండేలగూడ, రాచలూరు, ఇబ్రహీంపట్నం, బీబీనగర్, బొమ్మలరామారం, ములుగు, వర్గల్, తూప్రాన్, దొంతి, శివ్వంపేట, నర్సాపూర్, దౌల్తాబాద్, ఇస్మాయిల్‌ఖాన్‌పేట, ఎద్దుమైలారం, శంకర్‌పల్లి, చేవెళ్ల, తడపల్లె, షాబాద్ రీజినల్ రింగురోడ్డులో కలుస్తాయి.

 ఔటర్ రింగురోడ్డు గ్రోత్ కారిడార్ నుంచి సమీపంలో ఉన్న ఫరూఖ్‌నగర్, షాబాద్, చేవెళ్ల, సంగారెడ్డి, జీడిపల్లె తూప్రాన్, బీబీనగర్, భువనగిరి, మల్కాపూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, గుండేలగూడ, దౌడ్‌గూడ అర్బన్‌నోడ్స్ (సమీప పట్టణ ప్రాంతాలు).. రీజినల్ రింగురోడ్డులో కలువనున్నాయి.

రీజినల్ రింగురోడ్డులో పదిచోట్ల.. తూప్రాన్, నర్సాపూర్, కౌలంపేట, చేవెళ్ల, షాద్‌నగర్, కొత్తూరు, అగ్రాపల్లి, మల్కాపూర్, భువనగిరి, ములుగు దగ్గరలో జంక్షన్లు ఏర్పడనుండగా.. యువపూర్, బొమ్మలరామారం, బ్రహ్మణపల్లె, రెయిన్‌గూడ, గుమ్మడివల్లి, శేరిగూడ, భద్రపల్లి, నాగులపల్లి, ఫత్తేపూర్, నాస్తిపూర్, చంఢి ప్రాంతాల్లో పది టోల్‌ప్లాజాలు ఏర్పాటవుతాయని అంచనా.

 తెలంగాణలోని వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ ప్రాంతీయ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదించింది. నాగపూర్ (ఎన్‌హెచ్ 44), బెంగళూరు (ఎన్‌హెచ్ 44), ముంబై (ఎన్‌హెచ్ 65), విజయవాడ (ఎన్‌హెచ్ 65) రహదారులను అనుసంధానం చేయడంద్వారా నగరంపై ఒత్తిడి తగ్గడంతోపాటు ఔటర్ అవతలి ప్రాంతాల అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుందని భావిస్తున్నారు.