Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అమరావతి పేరు తో లక్ష కోట్ల దోపిడీ

రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆరోపించ...



రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో రూ.లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని దుయ్యబట్టారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను అనర్హులను చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ఇలాంటి వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు నిలదీయాలని విశాఖలో జరిగిన `సేవ్ ఆంధ్రప్రదేశ్' సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ పిలుపిచ్చారు. 


‘‘పాలక పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. వాస్తవ పరిస్థితులు చెప్పేవారు లేరు. ఎన్నికలయ్యాక రాజకీయాలు మరచిపోయి అందరికీ సమ న్యాయం చేయాల్సిన బాధ్యత పాలక పార్టీలపై ఉంటుంది. ఈ ప్రభుత్వం ఆ విషయం మరచిపోయి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచింది. పరిపాలన గురించి మాట్లాడాల్సిన కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌లో టీడీపీ కార్యకర్తలకు సహకరించాలని సీఎం మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించింది."అని విస్మయం వ్యక్తం చేశారు. 

 కొన్నాళ్ల క్రితం వరకు ఎమ్మెల్యేలు చెప్పినట్టే చేయాలనే వారు.. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలకూ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారని చెబుతూ నియోజకవర్గ నిధులను అధికార పార్టీ ఎమ్మెల్యేలకే కాకుండా ఆ పార్టీ నేతలకూ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. 

అమరావతిలో  ఆర్బీఐకి స్థలం కావలసి వస్తే ఎకరానికి రూ. 4 కోట్లు వసూలు చేశారని, కానీ ప్రైవేటు విద్యా సంస్థలు, ఆస్పత్రులకు రూ.50 లక్షలకే ఇస్తున్నారని గుర్తు చేశారు. మిగతా మూడున్నర కోట్లు ఎక్కడకు పోతుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.  

మాజీ చీఫ్‌ సెక్రటరీలు ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయకల్లంలు చెబుతున్న నిజాలు వింటుంటే కళ్లు తిరిగాయని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.  తన  రాజకీయ జీవితంలో ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని మండిపడ్డారు. 1996లో వచ్చిన తుపాను సహాయక చర్యల్లో ముందుగా పాల్గొన్నందుకు అప్పటి సీఎం చంద్రబాబు కలెక్టర్‌ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్‌ చేశారని గుర్తు చేశారు. పనిచేస్తే విపత్తు వస్తుందన్న పరిస్థితి అధికారుల్లో ఉందని చెప్పారు. 

ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ మాట్లాడుతూ  జన్మభూమి కమిటీలు పంచాయితీరాజ్‌ వ్యవస్థను ఖూనీ చేశాయని ఆరోపించారు. చంద్రన్న పేరిట వివిధ కార్డులపై సీఎం ఫోటోలు ముద్రిస్తున్నారని, ఈ ప్రభుత్వం మారిపోతే మళ్లీ కొత్తకార్డులు ముద్రిస్తారని, ఆ ఖర్చు ప్రజలపైనే పడుతుందని చెప్పారు. ప్రచారం సీఎంకి, భారం ప్రజలకా? అని ప్రశ్నించారు. 

యూపీఎస్సీ మాజీ ఇన్‌చార్జి చైర్మన్‌ కేఎస్‌ చలం మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పాలకులు వివక్ష చూపుతున్నారని, విశాఖను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.