ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపించారు. తన రాజీనామా నిర్ణయం తక్షణమే అమల్లోకి వ...
ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపించారు. తన రాజీనామా నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉర్జిత్ ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో వెల్లడించారు. కొన్నేళ్లుగా ఆర్బీఐలో వివిధ హోదాల్లో సేవలు అందించడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఆర్బీఐ రాణించడం వెనుక ఉద్యోగులు, డైరెక్టర్లు, మేనేజర్ల శ్రమ దాగి ఉందని తెలిపారు. డైరెక్టర్లు, ఉద్యోగులకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. వారందరికి అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉర్జిత్ పేర్కొన్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్గా సేవలందించడం గౌరవ ప్రదంగా భావిస్తున్నట్టు తెలిపారు.
2016 నుంచి ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా సేవలందిస్తున్నారు. ఆయన హయాంలోనే 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నోట్ల నద్దుపై ఉర్జిత్ పటేల్ అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (జేపీసీ) ఎదుట హాజరై పలుమార్లు వివరణ కూడా ఇచ్చుకున్న విషయం తెలిసిందే.
బోర్డు మీటింగ్ తర్వాతే..
ఇటీవల కాలంలో ఆర్బీఐ గవర్నర్కు కేంద్ర పెద్దలకు మధ్య దూరం పెరిగింది. ఆర్బీఐ వద్ద మిగులు నిధుల బదలాయింపు, ఎన్పీఏలు ఎక్కువ ఉన్న బ్యాంకులను పీసీఏ నుంచి బయట పడవేసే అంశం, నాన్ బ్యాంకింగ్ఫైనాన్స్ సంస్థలకు నిధులు సమకూర్చే విషయంలో ప్రభుత్వంతో ఉర్జిత్కు తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒక దశలో ప్రభుత్వం ఆర్బీఐపై నియంత్రణ సాధించేందుకు సెక్షన్ 7(ఎ)ను ఉపయోగించిందనే విషయం బయటకు రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సెక్షన్ (బి)ని కూడా ఆర్బీఐ పై అమలు చేయవచ్చనే వార్తలపై ఆందోళనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆర్బీఐ స్వేచ్ఛను గౌరవిస్తామని.. కానీ సంప్రదింపులు కొనసాగుతాయని ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రకటించింది. కానీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలోని ప్రభుత్వ ప్రతినిధుల రూపంలో ఆర్బీఐ గవర్నర్పై ఒత్తిడి పెంచింది. దీంతో గత నెల బోర్డు మీటింగ్కు ముందే ఉర్జిత్ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ప్రభుత్వ పెద్దలు బుజ్జగించడంతో అప్పట్లో ఈ అంశం సద్దుమణిగింది. బోర్డు మీటింగ్ తర్వాత ప్రభుత్వం కోరుకున్నట్టుగా నాలుగు బ్యాంకుల వరకు పీసీఏ నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉర్జిత్ ఈ రోజు అకస్మాత్తుగా తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపారు.