న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో ప్రతికూల వృద్ధిపై ఆందోళన నెలకొన్న సమయంలోనూ భారత ఐటీ రంగం రాబడి గణనీయంగా పెరగడం మన టెక్నాలజీ సామర్ధ్యానికి ని...
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో ప్రతికూల వృద్ధిపై ఆందోళన నెలకొన్న సమయంలోనూ భారత ఐటీ రంగం రాబడి గణనీయంగా పెరగడం మన టెక్నాలజీ సామర్ధ్యానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు పడిపోయిన క్రమంలో భారత ఐటీ పరిశ్రమ రెండు శాతం రెవెన్యూ వృద్ధిని సాధించిందని కొనియాడారు. నాస్కామ్ టెక్నాలజీ లీడర్షిప్ (ఎన్ఎల్టీ) కార్యక్రమంలో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. మహమ్మారి విసిరిన సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేందుకు ఐటీ కంపెనీలు అనుమతించాయని అన్నారు. కొవిడ్ సమయంలో మన శాస్త్ర, సాంకేతిక రంగాలు సత్తా చాటాయని వ్యాఖ్యానించారు.
గతంలో మనం స్మాల్పాక్స్ వ్యాక్సిన్ కోసం ఇతర దేశాలపై ఆధారపడగా ఇప్పుడు మన దేశంలో అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్లను పలు దేశాలకు సరఫరా చేసే స్ధాయికి ఎదిగామని అన్నారు. కరోనా మహమ్మారి సవాల్ విసిరిన సమయంలో మనం అందించిన సొల్యూషన్లు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయని చెప్పుకొచ్చారు. 'షేపింగ్ ద ఫ్యూచర్ టువార్డ్స్ ఏ బెటర్ నార్మల్' అనే థీమ్తో మొదలైన నాస్కామ్ 29వ సదస్సులో ఐబీఎం చీఫ్, సీఈఓ అరవింద్ కృష్ణ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్కుమార్, యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్, సైయంట్ ప్రెసిడెంట్, సీఈఓ కార్తికేయన్ నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.