లండన్ : భారత్లో కొనసాగుతున్న రైతు ఉద్యమం, పత్రికా స్వేచ్ఛ వంటి సమస్యలపై హౌస్ ఆఫ్ కామన్స్ (ప్రతినిధుల సభ)లో చర్చించాలని బ్రిటీష్ పార...
లండన్ : భారత్లో కొనసాగుతున్న రైతు ఉద్యమం, పత్రికా స్వేచ్ఛ వంటి సమస్యలపై హౌస్ ఆఫ్ కామన్స్ (ప్రతినిధుల సభ)లో చర్చించాలని బ్రిటీష్ పార్లమెంట్ పిటిషన్ కమిటీ భావిస్తోంది. ఆన్లైన్ పిటిషన్లో 1,06,000 సంతకాలు సేకరణ చేపట్టిన తర్వాత కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆన్లైన్ పిటిషన్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతకం కూడా వుండటం విశేషం. తాను ఓ ప్రధానిగా సంతకం చేయలేదని ఆయన పేర్కొన్నారు.
మానవ హక్కుల పరిరక్షణ, మీడియా స్వేచ్ఛ ఎంతో అవసరమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు స్వేచ్ఛాయుత వాతావరణంలో విధులు నిర్వహించాలని, ఎలాంటి బెదిరింపులకు లంగకూడదని ప్రభుత్వ అధికార ప్రతినిధి అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కాగా, పార్లమెంట్ అధికారిక వెబ్సైట్లో 'ఆర్గ్యూ ద ఇండియన్ గవర్నమెంట్ టూ ఎన్స్యూర్ సేఫ్టీ ఆఫ్ ప్రొటెస్టర్స్ అండ్ ప్రెస్ ఫ్రీడం' పేరుతో పిటిషన్కు ఉంచగా....లక్షకు పైగా సంతకాలు నమోదయ్యాయి. ఇలా లక్షకు పైగా సంతకాల సేకరణ జరిగితే...కచ్చితంగా బ్రిటీష్ పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే.
కాగా, రైతుల నిరసనలపై విదేశీ ప్రముఖలు, పలు సంస్థలు వ్యాఖ్యానించడంపై మండిపడ్డ భారత్..ఇది తమ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. భారత్లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే చాలా తక్కువ మంది రైతులు ఈ ఆందోళనలు చేపడుతున్నారంటూ కేంద్రం ఆరోపించింది. ఈ నిరసనలను భారత ప్రజాస్వామ్య విధానాలు, రాజకీయ నేపథ్యంలో చూడాలని కోరుకుంటున్నామంటూ రైతుల ఆందోళనలను తక్కువ చేసి చూపేందుకు కేంద్రం ప్రయత్నించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. ఇటువంటి విషయాలపై మాట్లాడేటప్పుడు ముందుగా సమాచారం తెలుసుకోవాలని పేర్కొంది. పాప్సింగర్ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా ధన్బర్గ్లు సంఘీభావం ప్రకటించిన తర్వాత కేంద్రం అక్కసు వెళ్లగక్కిన సంగతి విదితమే.