నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లుల పట్ల స్వదేశీ జాగరణ్ మంచ్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ బిల్లులను మంచి ఉద్దే...
నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్
ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లుల పట్ల స్వదేశీ జాగరణ్ మంచ్ హర్షం వ్యక్తం
చేస్తూ ఈ బిల్లులను మంచి ఉద్దేశ్యంతో తీసుకొచ్చారని కొనియాడింది. అయితే
ప్రభుత్వం ఆశిస్తున్నట్లు ఈ బిల్లుల ద్వారా రైతులకు ఏమాత్రం మంచి ధర
లభిస్తుందో అనే సందేశం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం తీసుకువచ్చిన ‘రైతుల ఉత్పత్తి వాణిజ్యం (ప్రోత్సాహ,
సదుపాయాల) బిల్, 2020 ఉద్దేశ్యం మధ్యవర్తులు లేకుండా రైతులు తమ ఉత్పత్తులకు
సరైన ధరలు పొందే ప్రయత్నంగా గుర్తు చేసింది. అయితే `మార్కెట్ ఫీజ్’ లేక
పోవడంతో కొనుగోలుదారులు వ్యవసాయ మార్కెట్ లకు వెలుపల ఉత్పత్తులు కొనే
ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.
అటువంటి పరిస్థితులలో ప్రైవేట్ వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్
కమిటీలను ఉత్పత్తుల కొనుగోలుకు ఎంచుకొనే పరిస్థితి ఉండకపోవచ్చని
వారించింది. దానితో రైతులు సహితం మార్కెట్ కమిటీలు (మండీలు) బైట తమ
ఉత్పత్తులను అమ్ముకొనక తప్పకపోవచ్చని తెలిపింది.
అదే జరిగితే, పరిస్థితులను ఆసరాగా తీసుకొని భారీ కొనుగోలు
కంపెనీలు రైతులను దోపిడీకి గురిచేసే
ప్రమాదమున్నది స్వదేశ్ జాగరణ్ మంచ్ హెచ్చరించింది. మార్కెట్
కమిటీలకు వెలుపల కొనాగుళ్లకు అనుకూలంగా చట్టాలు ఉన్నప్పుడు రైతులకు కనీసం
మద్దతు ధరలు ఏవిధంగా అమలు కాగలవని ప్రశ్నించింది.
కనీసం మద్దతు ధరలకన్నా తక్కువకు కొనుగోళ్లను చట్టవ్యతిరేకమని
ప్రకటించాలని మంచ్ డిమాండ్ చేసింది. కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్
కంపెనీలు సహితం ఈ ధరకు మాత్రమే కొనుగోలు చేసేవిధంగా చూడాలని స్పష్టం
చేసింది.
నూతన అనిబంధనల ప్రకారం తన పాన్ కార్డు చూపి రైతులు తమ ఉత్పత్తులను
అమ్మిన తర్వాత, వాటిని అందజేయగానే వారికి తక్షణం చెల్లింపులు జరగాలి లేదా
ప్రభుత్వమే అందుకు హామీ ఇవ్వాలని గుర్తు చేసింది. అయితే తమ ఉత్పత్తులను
అమ్ముకోవడానికి రైతులకు మరిన్ని భిన్న అవకాశాలు ఉండాలని కోరింది.
కొనుగోళ్లలో కేవలం ఒక పెద్ద కంపెనీ లేదా కొద్దీ కంపెనీలు ఆధిపత్యం
వహిస్తే రైతులకు ధర విషయమై బేరాలు చేసే అవకాశం ఉండబోదని మంచ్ ఆందోళన
వ్యక్తం చేసింది. దేశంలో 22,000 వ్యవసాయ మండీలను ఏర్పాటు చేస్తామని
ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ, ముందుగా సత్వరం వాటిని
ఏర్పాటు చేయాలనీ మంచ్ సూచించింది.
కాగా, ఈ బిల్లు `వ్యవసాయ ఉత్పత్తులలో పాల్గొనే వారు లేదా అద్దెకు
తీసుకున్న వారు రైతులు’ అని నిర్వచించడాన్ని ప్రస్తావిస్తూ దీని వల్లన
కంపెనీలు సహితం రైతుల నిర్వచనం కిందకు వచ్చే ప్రమాదం ఉన్నదని స్వదేశీ
జాగరణ్ మంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం వ్యవసాయం చేసేవారు మాత్రమే
రైతులు అనే నిర్వచనం కిందకు రావాలని, కంపెనీలు రాకూడదని స్పష్టం చేసింది.
ఇలా ఉండగా, కాంట్రాక్టు వ్యవసాయంలో వివాదాల పరిష్కారానికి
న్యాయసమ్మతమైన పరిష్కార యంత్రంగం ఉండాలని స్వదేశ్ జాగరణ్ మంచ్ డిమాండ్
చేసింది. ఈ బిల్లు ప్రతిపాదించే వివాదాల పరిష్కార యంత్రంగం చాలా
సంక్లిష్టంగా ఉండడమే కాకుండా, రైతులు దానిని ఉపయోగించేయడం చాలా కష్టం
కాగలదని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటికే అనేక బాధ్యతలను మోస్తున్న సుబ డివిజనల్ మెజిస్ట్రేట్ కి ఈ
బాధ్యత అప్పచెప్పడం వల్లన రైతులకు తగు న్యాయం జరగడం కష్టం
కాగలదని హెచ్చరించింది.