ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించి తిరుగు ప్రయాణమవుతుండగా, శివన్ భావోద...
ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించి తిరుగు ప్రయాణమవుతుండగా, శివన్ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆయనను హత్తుకుని ప్రధాని మోదీ ఓదార్చారు. ఆయనకు ధైర్యం చెప్పారు.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. అన్ని దశలనూ విజయవంతంగా దాటుకుంటూ వచ్చినా గమ్యం ముంగిట తడబాటు ఎదురైంది. ముందు నుంచి ఆఖరి 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతూనే వచ్చారు. ఈ 15 నిమిషాల్లో 14 నిమిషాలు ఎంతో సాఫీగానే సాగిపోయాయి. ప్రతి అంచెనూ విజయవంతంగా అధిగమిస్తున్నప్పుడల్లా శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. ఇక జాబిల్లిపై కాలుమోపడమే తరువాయి అనుకున్న దశలో ఊహించని అవాంతరం తలెత్తింది. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. జాబిల్లి దిశగా 48 రోజుల అద్భుత ప్రయాణం తర్వాత ఈ వ్యోమనౌకకు ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో శాస్త్రవేత్తల పట్ల మోదీ సంఘీభావం తెలిపారు. అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. శాస్త్రవేత్తల కష్టం వృథాకాదని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.