బిజెపికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడులతో పాటు ఇతర ప్రతిపక్షాల నేతలు ప్రతిపాదిస్తున్న మహా కూటమిలో చేరే ఉద్దేశమేమీ లేదని బ...
బిజెపికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడులతో పాటు ఇతర ప్రతిపక్షాల నేతలు ప్రతిపాదిస్తున్న మహా కూటమిలో చేరే ఉద్దేశమేమీ లేదని బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమిలోగానీ, బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోగానీ చేరబోమని బుధవారం ప్రకటించారు.
దేశంలోని రెండు ప్రధాన పార్టీలకు బీజేడీ దూరంగా ఉండి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు. మహాకూటమిలో చేరే విషయమై రెండు, మూడు రోజులలో నిర్ణయం తీసుకుంటామని ఆయన మొన్ననే ప్రకటించారు. బీజేడీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటించారు. రైతుల సమస్యలన్నీ తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన బిజెపి ఇప్పుడు అన్నదాతల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలో గౌరవ ప్రదమైన సంఖ్యలో లోక్సభ స్థానాలు దక్కించుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఒడిశాలోని మొత్తం 21 లోక్సభ స్థానాల్లో 2014 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలవగా.. కాంగ్రెస్ ఒక్కసీటును కూడా దక్కించుకోలేకపోయింది. 20 స్థానాల్లో బీజేడీ విజయ దుందుభి మోగించింది. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపి ఆశించదగ్గ రీతిలో విజయం సాధించడంతో ఈ సారి ఎలాగైనా బీజేడీని దెబ్బతీయాలనే యోచనతో ఉంది.