న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కు హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 25 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చ...
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ కు హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 25 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేశారు. కేవలం అక్కడితో ఆగకుండా ఆ సమాచారాన్ని అమ్మకానికి ఉంచడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రస్తుతం ఎయిర్టెల్ సిమ్ కార్డులను వాడుతున్న వారి చిరునామా, నగరం, ఆధార్ కార్డ్ నంబర్, లింగ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలతో పాటు టెలిఫోన్ నంబర్లను కొందరు హ్యాకర్లు ఎయిర్టెల్ సెర్వర్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా దొంగలించారు.
అయితే, భారతదేశంలోని ఎయిర్టెల్ వినియోగదారులందరి వివరాలు తమ వద్ద ఉన్నాయని వారి డేటాను విక్రయించాలనుకుంటున్నట్లు హ్యాకర్లు పేర్కొంటున్నారు. ఇంటర్నెట్ భద్రతా పరిశోధకుడు రాజ్శేఖర్ రాజహర్యా ఈ సమాచారాన్ని వెల్లడించారు. హ్యాకర్లు ఎయిర్టెల్ భద్రతా బృందాలను బ్లాక్ మెయిల్ చేసి 3500 డాలర్లు విలువైన బిట్కాయిన్ల వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ డీల్ విఫలం అయ్యేసరికి హ్యాకర్లు వారి వెబ్సైట్లో డేటాను అమ్మకానికి ఉంచారు. దాని కోసం ఒక వెబ్సైట్ను సృష్టించారు. దొంగలించిన డేటాలో ఎక్కువ శాతం జమ్మూ&కాశ్మీర్ ప్రాంతంలోని చందాదారులవి అని తెలుస్తుంది.
ఈ వ్యవహారాన్ని రాజశేఖర్ రాజహర్యా అనే ఇంటర్నెట్ సెక్యురిటీ రీసెర్చర్ బయటపెట్టారు. తన ట్విట్టర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను పోస్ట్ చేశాడు. దీనిపై ఎయిర్టెల్ ప్రతినిధులు స్పందించారు. "ఎయిర్టెల్ తన వినియోగదారుల ప్రైవసీని కాపాడటానికి అనేక రకాల చర్యలను తీసుకుంటుందని.. తమ వద్ద నుంచి ఎలాంటి డేటా బయటకి లీక్ కాలేదని" ఎయిర్టెల్ తెలిపింది.